08-09-2025 04:06:28 PM
సనత్నగర్ (విజయక్రాంతి): మైత్రివనం స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ బాధిత రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తమ భూములకు తగిన పరిహారం అందకుండా అన్యాయానికి గురవుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ.. “మన పారంపర్య భూములను ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నా, ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాసం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు హామీలు ఇచ్చినా అమలు కాలేదు. మాకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం” అని హెచ్చరించారు. హెచ్ఎండీఏ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న రైతులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు.