28-11-2025 04:50:43 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): అయ్యప్ప స్వాములు నిత్య అన్న ప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరి పద్మ మహేందర్ దంపతులు అన్నారు. శుక్రవారం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ.. దాతల సహాయ సహకారాలతో 15 సంవత్సరాలుగా అన్నదాన శిబిరం నిర్వహించి అదే స్థానంలో దాతల సహకారంతో 8 నెలల్లోనే అయ్యప్ప దేవాలయం నిర్మించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ నిత్య అన్నదాన శిబిరం దాదాపు మకర సంక్రాంతి జ్యోతి వరకు దాదాపు 50 రోజులు కొనసాగుతుందని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి వద్ద ప్రత్యేక పూజలు అనంతరం మహేందర్ అతిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ రైస్ మిల్ వ్యాపారులు, పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్త బృందం పాల్గొన్నారు.