15-07-2025 12:27:55 AM
తెలంగాణ మున్నూరు కాపు సంఘాల డిమాండ్
ఖైరతాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వం తక్షణమే వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు డిమాండ్ చేసాయి. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ ము న్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విలేకరు ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ మల్ల న్నపై తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కవిత అనుచరులు దాడి చేశారని తెలిపారు. ఒక మామూలు సామెత వాడినందుకు మసిపూసి మారేడు కాయ చేసి విధ్వంసం అరాచకం సృష్టించి బీసీలను భయభ్రాంతులకు గురిచేయాలన్న కుట్రతోనే తీన్మార్ మల్లన్న పై కవిత దాడి చేయించిందని ఆరోపించారు.
ఆదివారం మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆగ్రకుల ఆధిపత్య అహంకార వైఖరికి ఇది నిదర్శనమని ఇటువంటి అహంకారపూరితమైన దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.
దాడి చేసిన వారిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని జాగృతి సంస్థ ముసుగులో అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నందున ఆ సంస్థను నిషేధించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చామకూర రాజు, ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ,పర్వతం వెంకటేశ్వర్లు, మణికొండ వెంకటేశ్వర్లు, పెద్ది పెంటయ్య, బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.