15-07-2025 01:20:20 AM
- నాంపల్లి మార్కెట్ ఏరియాలో.. పాడుబడిన ఇంట్లో..
- వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టిన యువకుడు
- యువకుడిని విచారిస్తున్న పోలీసులు
-హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు
హైదరాబాద్,సిటీబ్యూరో జూలై 14 (విజయక్రాంతి): హైదరాబాద్లోని ఓ పాడుబడిన ఇంట్లో అస్థిపంజరం బయటపడడం సంచలనం సృష్టించింది. క్రికెట్ బంతి కోసం ఓ యువకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ సమీపంలో ఏడేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం కనిపించడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
మార్కెట్ ఏరియాలోని ఓ ఇండిపెండెంట్ హౌస్కు గత ఏడేళ్లుగా తాళం వేసి ఉంది. ఇంటి యజమాని విదేశాల్లో స్థిరపడటంతో ఆ ఇంటివైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. స్థానిక యువకులు కొందరు ఆ ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుతుండగా, బంతి ఆ ఇంటి కాం పౌండ్లో పడింది. దాన్ని తెచ్చుకోవడానికి ఓ యువకుడు ఇంటి వెనుక నుంచి మేడపైకి ఎక్కి లోపలికి ప్రవేశించాడు. ఇల్లంతా దుమ్ము, బూజు పట్టి ఉండగా, సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బంతి కోసం వెతుకుతుండగా ఫ్రిజ్ ముందు పడి ఉన్న మనిషి అస్థిపంజరాన్ని చూసి ఆ యువకుడు నివ్వెరపో యాడు. వెంటనే ఆ దృశ్యాన్ని తన ఫోన్ లో చిత్రీకరించి ఫేస్ బేక్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియా లో వైరల్ అయింది.
విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. సమాచారం అందుకున్న హబీబ్నగర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్, ఫోరెన్సిక్ బృందా లు ఆధారాలు సేకరించాయి. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. అస్థిపంజరం పురుషుడిదా, స్త్రీదా అన్నది ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక స్పష్టత రానుంది. కాగా ఆ అస్థిపంజరం ‘అమీర్ ఖాన్’ అనే వ్యక్తిది కావచ్చని అనుమానిస్తున్నారు.
కరోనా సమయంలో ఆస్తి, పెళ్లి విషయమై తన సోదరులతో గొడవపడి అమీర్ ఖాన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతని ఆచూకీ లభించలేదు. కు టుంబసభ్యులు కూడా అతని అదృశ్యం పై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో అప్పుడే అతను ఈ ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణం లో విచారిస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.