calender_icon.png 15 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ

15-07-2025 12:00:00 AM

  1. సినీ రంగానికి ప్రత్యేక చాప్టర్ 
  2. రామోజీ ఫిలీం సిటీ దేశంలోనే యూనిట్ స్టూడియో.. తెలంగాణలో ఉండటం గర్వకారణం
  3. శ్రీమద్భాగవతం పార్ట్--1 సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

రంగారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి)/ అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణను 2035 నాటికి ట్రిలియన్ ఎకా నమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీకి చేర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యే కంగా ఓ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకున్నట్టు సీఎం వివరించారు.

ఇందులో సినీ రంగానికీ ప్రత్యేకం గా చాప్టర్ ఉంటుందని ఆయన హామీనిచ్చారు. రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున, సమతౌల్య విధానంతో నేడు మళ్లీ శ్రీమద్భాగవతాన్ని చిత్రీకరించడం సంతోషకరమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దు ల్లాపూర్‌మెట్ మండలంలో రామోజీ ఫిల్మ్ సిటీలో సోమవారం శ్రీమద్భాగవతం పార్ట్--1 నిర్మాణ చిత్రీకరణను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రామాయణం, భాగవతం లాంటి పురాణ గాథలు మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయని చెప్పారు. 40 ఏండ్ల కింద వచ్చిన రామాయణ సీరియల్‌ను చిత్రీకరించి టెలివిజన్‌లో ప్రసారం చేసిన రామానంద్ సాగర్ ఒక చిరస్మరణీయ వ్యక్తి అని, ఆ సీరియల్ సమయంలో ఎవరూ రోడ్లపై ఉండేవారు కాదని, అంద రూ ఆ సీరియల్ చూసేవారని గుర్తు చేసుకున్నారు.

కొవిడ్ సమయంలో మళ్లీ ఆ సీరియల్‌ను టెలికాస్ట్ చేస్తే, ప్రపంచ రికార్డు సృష్టించిందని సీఎం తెలిపారు. ఆ సినిమాను చిత్రీకరించిన రామానంద్ సాగర్‌కు సంబంధించిన మోతీసాగర్, అమృత్ ఆకాశ్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మహా భాగవతం పార్ట్ నిర్మాణాన్ని చేపట్టడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. రామాయణం సీరియల్ లాగానే ఈ భాగవతం, మహాభారతం సినిమా అందరి ప్రశంసలు పొంది విజయవంతంగా ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ, సహకారాలు అందిస్తోందని హామీ ఇచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతమైన చిత్రాలను నిర్మించడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుందదన్నారు. తాను యూనివర్సల్ స్టూడియోని చూడలేదని.. దేశంలోనే రామోజీ ఫిలీం సిటీకి ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్, భగవత్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మోతీసాగర్, అమృత్‌సాగర్ చోప్రా, ఆకాశ్‌సాగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.