03-07-2025 01:49:26 AM
ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) బుధవారం తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఢాకాలో అల్లర్లు చెలరేగిన తర్వాత బంగ్లా విడిచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్న హసీనాకు ఓ కేసులో శిక్షపడటం ఇదే తొలిసారి.
జస్టిస్ ఎండీ. గోలమ్ మొర్తజా మొజుందార్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్లోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం హసీనాకు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హసీనా అరెస్ట్ అయిన నాటి నుంచి లేదా ఆమె లొంగిపోయిన రోజు నుంచి శిక్షా కాలం లెక్కలోకి వస్తుందని కోర్టు పేర్కొంది.
ఫోన్ కాల్ లీక్తో కోర్టు ధిక్కార కేసు
గతేడాది అక్టోబర్లో షేక్ హసీనా వి ద్యార్థి విభాగం నాయకుడు షకీల్ అకంద్ బుల్బుల్తో సంభాషించినట్టు ఒక ఆ డియో కాల్ లీక్ అయింది. లీక్ అయిన ఈ ఆడియో కాల్ ఆధారంగానే కోర్టు ధిక్కార కేసు నమోదు అయింది. ‘నాపై 227 కేసులు నమోదయ్యాయి. 227 మందిని చంపేందుకు నాకు లైసెన్స్ వచ్చింది.’ అని ఆనాటి కాల్లో హసీనా షకీల్తో అన్నట్టు ఉంది. హసీనా మాట్లాడింది న్యాయ ప్రక్రియను బెదిరింపులకు గురి చేసే విధంగా ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది.