23-04-2025 01:51:52 PM
సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి...
అనంతగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత ఏర్పడుతుందని, దీంతో సకాలంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు విక్రయించలేకపోతున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలలో హమాలీలకు కూలి రేట్లు పెంచకపోవడంతో వారు మధ్య దళారుల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, మధ్య దళారులు హమాలీలకు ఎక్కువ మొత్తంలో కూలీ చెల్లిస్తున్నారని దీంతో వారు అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలు ధాన్యం నిలవ ఉండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. అంతేకాకుండా మిల్లులు వద్ద తరుగు పేరుతో కోత విధిస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇబ్బందికి గురి చేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.