11-07-2025 11:31:06 AM
అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య
వనపర్తి టౌన్ : జనాభా పెరుగుదల నియంత్రణతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అదనపు కలెక్టర్(Additional Collector) స్థానిక సంస్థలు యాదయ్య అన్నారు. జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి నిర్వహించిన ర్యాలీకి అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కాన్పుల మధ్య ఎడం, తల్లి బిడ్డల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పాటించండి, ఆరోగ్యంగా జీవించండి, కుటుంబ సంక్షేమం, దేశ సౌభాగ్యం అని ర్యాలీలో నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
కాన్పుకు కాన్పుకు మధ్య ఎడమ ఉండాలని తెలియజేశారు. జనాభా పెరుగుదల నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బాధ్యత గల ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. బాల్య వివాహాల వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు, రక్తహీనత, గర్భస్రావం సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి కుటుంబం ఒక్కరు లేదా ఇద్దరు సంతానంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ బండారి శ్రీనివాసులు, వైద్యాధికారులు, నర్సింగ్ విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.