20-09-2025 12:06:11 AM
ఈ ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా విత్తనాలు వేయడమే కాదు, పంట ఎదుగుదల కీలకదశలో ఉంది. పత్తి పూత దశలోకి, వరి పొట్ట దశలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో రైతులకు యూరియా అందకపోవడం ఆందోళనకర అంశం. యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడి చేతిలో ఆధార్, పాస్బుక్కులు పట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా ఒక యూరియా బస్తా రైతులకు దొరకడం లేదు.
దీనిపై అటు కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు రైతులకు కావాల్సింది యూరియా, పండించిన పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టపోతే పరిహారం. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. రైతన్నకు ప్రభుత్వమే అండగా నిలబడాల్సిన అవసరముంది.
కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ మౌనం రెండూ కలిసి రైతులను కష్టాల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలి.
మహేశ్ గౌడ్, వరంగల్