16-08-2024 01:54:24 AM
కరీంనగర్, ఆగస్టు 15 (విజయక్రాంతి): వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన కొడుకులు.. వారి బాధ్యతలను మరిచి వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్దిలో చోటుచేసుకున్నది. మానకొండూర్ సీఐ సదన్కుమార్ గ్రామస్తులతో సమాచారం తెలుసుకొని అవ్వకు అండగా నిలిచారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లూరి మల్లమ్మ(75) భర్త కనకయ్య విశ్రాంత ఉద్యోగి. ఏడాది క్రితం కనకయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు కిష్టయ్య, కిరణ్కుమార్ నెలవారీగా వంతులు వేసుకుని మల్లమ్మను పోషించారు.
కొద్దిరోజులుగా ఆమెను పోషించడం లేదు. పైగా ఇంటి నుంచి వెళ్లగొట్టారు. వృద్ధురాలి భర్త సంపాదించిన భూమి, ఇల్లును ఇద్దరు కుమారులకు సమానంగా పంచినా వారికి కనికరం లేదు. భర్త కనకయ్య ఫొటోను సైతం బయట విసిరేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని పిల్లలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసిన వారికే ఆస్తి అనుభవించే హక్కు ఉంటుందన్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేస్తామన్నారు.