18-11-2025 10:01:07 PM
నకిరేకల్ (విజయక్రాంతి): రాబోయే అమావాస్య సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేకించి శానిటేషన్ (పరిశుభ్రత), డ్రింకింగ్ వాటర్ (తాగునీరు), క్యూలైన్ నిర్వహణ వంటి అత్యవసర సేవలను మరింతగా మెరుగుపరుస్తున్నట్టు ఆయన వెల్లడించారు.రానున్న రోజుల్లో దేవస్థాన అభివృద్ధి పథకాలపై వేగంగా పనిచేసి, ఆలయ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తామని తెలిపారు. అంతేకాక, దేవస్థానానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా స్వచ్ఛత పాటించాలని, ఒకరికొకరు ఇబ్బందులు కలగకుండా శాంతి-పరిపాలనకు సహకరించడం ప్రతి భక్తుడి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా సూచించారు.