18-11-2025 11:08:22 PM
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు..
ఎల్బీనగర్: సినీ దర్శకుడు రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీ. రామ్ కుమార్ జోషి, గోరక్ష రాష్ట్ర అధ్యక్షుడు రామ్ కుమార్ జోషి, రాష్ట్రీయ వానర సేన సభ్యులు మాట్లాడుతూ... ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి ‘వారణాసి‘ తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ లో కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువుల ఆరాధ్యదైవమైన హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. హనుమంతుడిని ఈయనేం దేవుడు..!? ఇతను దేవుడా అని అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. స్వలాభం కోసమే మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న స్వార్ధపరులను కఠినంగా చట్టప్రకారంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించామని, న్యాయనిపుణుల సలహాతో తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ సైదిరెడ్డి తెలిపారు.