07-05-2025 04:29:54 PM
గిరిజనుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రెండు దశాబ్ధాలకుపైగా పెనగడప అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary S.K. Sabir Pasha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చుంచుపల్లి మండలం, పెనగడప గ్రామపంచాయతి పరిధిలోని పాలవాగు, జగ్గారం, మర్రిగూడెం, గడ్డిగుట్ట ఆదివాసీ గ్రామాల ప్రజల సమావేశం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన సాబీర్ పాషా వలస ఆదివాసీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి దశాబ్దాల క్రితం గిరిజన ఆదివాసీలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని, వీరికి రెవిన్యూ శాఖా ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారిచేయండంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. జిల్లాలో 150కి పైగా ఆదివాసీ గూడేలు ఉన్నాయని, వీరిని స్థానికులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీ గ్రామాల్లో కావాల్సిన త్రాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు వైద్య సదుపాయం అందుబాటులోకి తెచ్చేవిదంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిపిఐ నాయకులు నీడాల సుధాకర్, కట్టా ఉదయ్, మన్నే వీరభద్దరావు, లక్ష్మణరావు, మన్నే మనోజ్ కుమార్, ఆదివాసీలు ముడివి భీమా, ముడివి చుక్కయ్య, చోడేమ్ భీమా, బాలరాజు, కొమరం భీమా, పద్దం నంద, పొదెం చందు తదితరులు పాల్గొన్నారు.