17-07-2025 10:29:05 PM
గద్వాల,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రస్తుత వ్యవసాయ సీజనల్ పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి యూరియా, డీఏపీ, పొటాష్ కంప్లెక్స్ వంటి అవసరమైన ఎరువులు పూర్తిగా అందుబాటులో ఉన్నందున, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానికి ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులు తమకు అవసరమైన ఎరువులను వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పొందాలని కలెక్టర్ సూచించారు.అదే విధంగా సీడ్ కంపెనీలు రైతులు పండించిన ప్రతి గింజను పూర్తిగా కొనుగోలు చేస్తామని లిఖితపూర్వక పత్రాలను సంస్థల నుండి వెంటనే సేకరించాలన్నారు. వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు.