22-09-2025 12:00:00 AM
సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క.
ములుగు, సెప్టెంబరు21(విజయక్రాంతి):ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయంను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపద్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ,గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్,ఎస్పి షభరిష్ లతో కలిసి పరిశీలించారు.
సమ్మక్క సారలమ్మ దేవాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు పరిసర ప్రాంతాలను వీక్షించి ఏర్పాట్లను పకడ్బందిగా చేయాలని అధికారులను సూచించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ నెల 23న మేడారంకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారని, ఛాపర్ ద్వారా మేడారం చేరుకుంటారని, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం, మేడారం మహా జాతరకు సంబంధించిన పనులను శంకుస్థాపన,అధికారులు, పూజారులతో సమీక్ష సమావేశం, ప్రెస్ మీట్ అనంతరం గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్నరని వివరించారు.
సమ్మక్క సారలమ్మ దేవతలపై ముఖ్యమంత్రికి అపార నమ్మకం ఉన్నదని,మేడారంకు ముఖ్య మంత్రి రావడం చాలా సంతోషకరమని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అధికారులకుపలు సూచనలు చేశారు.
ఈ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్ పి శబరిష్ ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అంతకు ముందు మేడారం ఐటీడీఏ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.