విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో నిర్మాణానికి నోచుకొని వినియోగించకుండా ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని కళాశాల ప్రిన్సిపాల్ కు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కళాశాలలో కొందరు విద్యార్థులను బయట కింద కూర్చోబెట్టడంపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్, విద్యార్ధినులను తరగతి గదిలోనే కూర్చోబెట్టాలని సూచించారు. మరుగుదొడ్లు, తరగతి గదుల విషయంలో విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అదనపు తరగతి గదుల నిర్మాణం గురించి సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని అంశంపై ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు. కళాశాల ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.




