02-09-2025 05:05:30 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, రోజువారీ పేషెంట్ల సంఖ్య, స్థానికంగా జరిగే కాన్పులపై సమాచారం తీసుకున్నారు.
సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాల కోసం ప్రయత్నించాలన్నారు. అలసత్వానికి తావు లేదని, బాధ్యతలపై నిబద్ధతతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. తప్పుదోవ పట్టిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడానికీ సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు ముందస్తుగా అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రసవ తేదీ దగ్గరగా ఉన్న మహిళలను ముందే నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తేనే, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.