24-05-2025 04:38:24 PM
రాష్ట్ర పరిశీలకులు సైట్(SIET) డైరెక్టర్ విజయలక్ష్మి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయశాంతి): రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వృత్యాంతర శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశీలకులు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మి(State observers Site Director Vijayalakshmi) అన్నారు. శనివారం పాల్వంచ పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొమ్ముగూడెంలో జరుగుతున్న భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా, జూన్ 12 నుంచి మొదలవుతున్న నూతన విద్యా సంవత్సరంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని కూడా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, విద్యార్థుల కోసం నిరంతరం సబ్జెక్టు పట్ల అవగాహనను పెంపొందించుకోవలసిన బాధ్యత ఉంటుందన్నారు. ఈ శిక్షణలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఉపాధ్యాయుల ద్వారా వినడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వబోతున్న యూనిఫామ్ స్టిచ్చింగ్ ను పరిశీలించేందుకు పాల్వంచలోని నెహ్రు నగర్ నందు నిర్వహిస్తున్న స్టిచ్చింగ్ సెంటర్ ను సందర్శించినారు. ఈ సందర్భంగా టైలర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ, జూన్ 12 నాటికి ఒక జత యూనిఫామ్ ను సిద్ధం చేసి విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని టైలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఎస్.కె సైదులు, ఎస్ హెచ్ జి సభ్యులు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.