03-11-2025 02:31:33 AM
పాట్నా, నవంబర్ 02: జంగల్ రాజ్ (ఆటవిక పాలన)ను బీహారీలు ఇంకా మరచిపోలేదని, త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం తప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆరాలో నిర్వహించిన ప్రచార సభల్లో మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి అటు పాకిస్థాన్ ఇటు కాంగ్రెస్ కోలుకోలేదని వ్యాఖ్యానించారు. అక్కడ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం పడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ పెద్దల కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడిపాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం జాతీయ భద్రత, సైన్యానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేస్తోందని తెలిపారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశాయని, ఉగ్రవాదులను వారి గడ్డమీదనే శిక్షించాలని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ రూపంలో దానిని నెరవేర్చామని వివరించారు. రాహుల్ గాంధీ చేపట్టినది ఓటరు యాత్ర కాదని అది చొరబాటు దారులను రక్షించేది అంటూ విమర్శించారు. ఎన్డీయే మ్యానిఫెస్టోలో నిజాలు ఉంటే ప్రతిపక్షాల హామీ పత్రం అబద్ధాలతో నిండి ఉందని పేర్కొన్నారు. సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ను ప్రకటించాలని కాంగ్రెస్ అనుకోలేదని, తుపాకీ ఎక్కుపెట్టి మరీ ఆర్జేడీ ఈ అవకాశాన్ని దక్కించుకుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.