03-09-2025 12:33:54 PM
దుకాణం వద్దే రోడ్డుపై రైతులు ధర్నా
ధర్నాకు మద్దతు తెలిపిన బిజెపి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యూరియా కొరతతో నల్లగొండ రైతులు ఇబ్బందులు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డు వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ(Venkateshwara Agro Agency) వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే ఎరువుల కోసం అన్నదాతలు గంటలకు తరబడి క్యూలో నిలుచున్నారు. వర్షాల సీజన్లో తక్షణమే యూరియా అందకపోతే పంటలు ఎండిపోతాయని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా సరఫరా లేని ప్రభుత్వంపై రైతుల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎరువుల కొరతను వెంటనే తగ్గించి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పంటల దశలోనే యూరియా లభ్యం కాకపోతే భారీ నష్టాలు తప్పవని ప్రభుత్వానికి రైతు హెచ్చరికలు జారీ చేశారు.
ఎరువులు అందక పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు అక్కడే రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు బిజెపి మద్దతు తెలిపింది. వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ రైతులు పంటల యూరియా కోసం క్యూలలో నిలబడాలా అని పేర్కొన్నారు. పంట సీజన్లోనూ ఎరువులు అందించలేని ప్రభుత్వం రైతుల పక్షాన ఉందా అని ప్రశ్నించారు. సమయానికి ఎరువులు అందక పంటలు ఎండిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా పెంచాలని కొరత సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోతే పాక సాంబయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.