04-08-2025 06:01:00 PM
కలెక్టర్ హనుమంతరావు..
వలిగొండ (విజయక్రాంతి): స్థానిక నాయకులు పేదల పక్షాన నిలబడి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యాలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ప్రతి సోమవారం లబ్ధిదారులకు డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, బేస్మెంట్ పూర్తయిన వారికి లక్ష రూపాయలు, లెంటల్ లెవెల్ పూర్తయిన వారికి లక్ష రూపాయలు, స్లాబు పూర్తయిన వారికి రెండు లక్షల రూపాయలు, పూర్తిగా అయిపోయిన వారికి లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటుక, ఇసుక త్వరగా సేకరించి పూర్తి చేయాలని అన్నారు. మహిళా సంఘాల నుండి డబ్బులు లేని వారు లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని లోన్లు అందజేసే విషయంలో మహిళా సంఘాలను అభినందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బెలిదే నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.