మహిళా సాధికారతతోనే దేశ పురోగతి
- ఆచారాలు, సంప్రదాయాల నుంచి వారికి విముక్తి కల్పించాలి
- మహారాష్ట్ర ‘ఉద్యోగవర్ధిని’ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 19: దేశ పురోగతి జాతీయాభివృద్ధి సాధించాలంటే మహిళా సాధి కారత చాలా కీలకమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. తిరోగమన ఆచారాలు, సంప్రదాయాల నుంచి మహిళలు విముక్తి పొందాల్సిన అవసరముందని తెలిపారు.
నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మహారాష్ట్రలోని సోలాపూ ర్లో శుక్రవారం స్వచ్ఛంద సంస్థ ‘ఉద్యోగవర్ధిని’ నిర్వహించిన సభకు మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఒక పురు షుడు తన మరణం వరకు పని చేస్తాడు. స్త్రీ కూడా తన జీవితం చివరి వరకు కష్టపడుతూనే ఉంటుంది.
అంతకుమించి ఆమె తన సేవలతో తర్వాతి తరాలకు స్ఫూర్తినిస్తుంది. మాతృత్వపు ప్రేమలోనే పిల్లలు పెరిగి పెద్దవాళ్లు ప్రయోజకులవుతున్నారు. పురుషులు చేయలేని కొన్ని పనులు మహిళలు చేసేలా ఆ భగవంతుడు అదనపు గుణాన్ని ఇచ్చారు. ఇకపై స్త్రీలను మేము ఉద్దరిస్తామని చెప్పడం తగదు.
జాతీయాభివృద్ధికి మహిళా సాధికారత చాలా అవసరం’ అని పేర్కొన్నారు. మహిళా సాధికారత విషయంలో ఉద్యోగవర్ధిని చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయమని మోహన్ భగవత్ తెలిపారు.






