05-12-2024 02:33:24 AM
* నేటి వరకు పాల్గొనని వారికి అవకాశమివ్వాలి
* ప్రభుత్వానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): రాష్ర్టంలో సమగ్ర కులగనన సర్వే 100 శాతం పూర్తి చేయడానికి ప్రభుత్వం మరో వారం రోజులు గడువు పెంచాలని, ఇప్పటివరకు అనివార్య కారణాల వలన కులగణన సర్వేలో పాల్గొనని వారికి ప్రత్యేకించి స్థిరనివాసం లేని సంచార జాతులకు మరొకసారి అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విన్నవించారు. బుధవారం ప్రణాళిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఓఎస్డీ విద్యాసాగర్కు 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందజేశారు.
ఇప్పటికే 17 జిల్లాల్లో 100శాతం సర్వే పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించడానికి ఆయన తప్పుపట్టారు. రాష్ర్ట ప్రభుత్వానికి జిల్లా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని జీవనోపాధి కోసం వలస పోయిన వారిని అలాగే నీటి వరకు ఆధార్, రేషన్ కార్డు, స్థిరనివాసం లేనటువంటి 56 కులాల సంచార జాతులకు ఇప్పటివరకు సర్వే జరగలేదన్నారు.
అలాంటప్పుడు 100శాతం సర్వే పూర్తయిందని ఎలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని ఆయన ఆక్షేపించారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు కుటుంబాలను గుర్తించి ఇంటికి స్టిక్కరింగ్ వేసిన వారికి మాత్రమే సర్వే నిర్వహించారని అసలు ఇల్లు కూడా లేని వారికి స్టిక్కరింగ్ వేయని వారికి సర్వే నిర్వహించలేదన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికి 70 శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందని ఇంకా 30 శాతం సర్వే పూర్తి కావాల్సి ఉందన్నారు.
కులగణన సర్వే సంపూర్ణంగా విజయవంతంగా జరగాలంటే రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే సంచార జాతుల కోసం మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. తెలంగాణలో జరిగే కులగణన రేపు భవిష్యత్తులో దేశానికి రోల్ మోడల్ గా ఉంటుందని జాజుల తెలిపారు.