31-07-2025 12:21:26 AM
కోదాడ ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ
మునగాల, జులై 30 -(విజయ క్రాంతి): అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.మండల కేంద్రంలో గల రైతు వేదికలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు.
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతోపాటు, గృహలక్ష్మి పథకంతో అర్హులైన వారందరికీ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తుందని చెప్పారు. రైతు భరోసా ఇవ్వడమే కాకుండా గతంలో వారు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేసి వారికే అండగా నిలిచిందన్నారు. యువత కోసం దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు.
ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం తినాలని ఆలోచనతో రేషన్ కార్డు కలిగిన పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య.తాసిల్దార్ రామకృష్ణారెడ్డి. ఎండిఓ రమేష్ దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు.