calender_icon.png 18 August, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అవుట్ సోర్సింగ్’ వేతన కష్టాలు

18-08-2025 01:08:46 AM

  1. కొన్ని శాఖల్లో మూడు నెలలకు పైగా పెండింగ్
  2. మరికొన్ని శాఖల్లో రెన్యూవల్ కాక ఉద్యోగుల ఇబ్బందులు
  3. రాష్ట్రంలో 2 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
  4. ఏజెన్సీలతోనూ తలెత్తుతున్న సమస్యలు
  5. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా వేతనాలివ్వాలి
  6. ఆందోళనకు సిద్ధమంటున్న అవుట్ సోర్సింగ్ జేఏసీ

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి వేచి చూస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన కష్టాలు తప్పడం లేదు. వారి ఇబ్బందులు మాత్రం పరిష్కారం కావడం లేదు. వేతనాల పెండింగ్‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు రెన్యూవల్ కాకపోవడం కూడా వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది.

అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏజెన్సీల ద్వారా పనిచేస్తుండటంతో వేతనాలు ఆలస్యమవుతున్నాయని వారు ప్రధానంగా చెబుతున్నారు. కమిషన్లు సైతం ఎక్కువగా తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ర్టంలో 52 శాఖలు ఉండగా, వాటిలో అనుబంధ కార్పొరేషన్లలో కలిపి సుమారు 2 లక్షల మంది పనిచేస్తున్నారు. వారంతా నిరుద్యోగులు.

మరోవైపు కుటుంబ పోషణ కోసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏజెన్సీల ద్వారా ఎంపిక, వచ్చే వేతనాలు తక్కువ. ఇదిలా  ఉండగా ప్రభుత్వం కూడా వేతనాలు ప్రతినెలా మంజూరు చేయకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలలుగా వేతన చెల్లింపుల్లో జాప్యంతో కుటుంబ పోషణ భారమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏజెన్సీల పరిధిలో నియామకం 

గత ప్రభుత్వాలు ఆయా శాఖల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాయి. అయితే వారు కమిషన్ బేస్‌తో పనిచేయడంతో, ఆ ఏజెన్సీ ఖాతాల్లోనే వేతనాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం జమచేస్తుంది. దీంతో ఏజెన్సీ సంస్థలు వారి కమిషన్ మినహాంచుకుని మిగతా నిధులను ఉద్యోగుల ఖాతాల్లో వేయడంతో నాలుగు వేలకు పైగా తగ్గుతుంది. దీంతో అవుట్ సోర్సింగ్ పరిధిలో పనిచేసే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాకుండా కార్మికులకు సీనియార్టీని బట్టి రూ.10 వేల నుంచి రూ.22,500 వరకు నెల వేతనంగా అందుతుంది.

ప్రభుత్వం నెలనెలా వేతనాలు మంజూరు చేయకపోయినా సంబంధిత ఏజెన్సీలు కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీలు సైతం ప్రభుత్వంపై భారం మోపి వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నదని, నెల తిరిగే సరికే పిల్లల ఫీజుల, ఇతర ఇంటి ఖర్చుల నేపథ్యంలో జీవితం భారంగా మారి ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలు పీఎఫ్, ఈఎస్‌ఐలు సైతంచెల్లించకపోవడంతో కార్మికులకు ఇక్కట్లు తప్పడం లేదు.

వేతనాల పెండింగ్

పలు శాఖల్లో పనిచేసేవారికి నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ర్టంలోని వసతి గృహాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ అవుట్ సోర్స్ ఉద్యోగులకు 3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.

రంగారెడ్డిలోని బీసీ కాలేజీ హాస్టల్ ఉద్యోగులకు 9 నెలలు, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో పనిచేసేవారికి రెండు నెలలు, శిశు సంక్షేమ శాఖ కింద పనిచేసే బాలసదనంలో వారికి రెండు నెలలు, భూ భారతి ఆపరేటర్‌లకు 15 నెలలు, ఏసీబీలో పనిచేసేవారికి 2 నెలలు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసులో 2 నెలలు, కొత్తగూడెం జిల్లాలో బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్  హాస్టల్‌లో 8 నెలలు, సిద్దిపేట జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 6 ఆరు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. 

19 వేలకు పైగా ఉద్యోగుల తొలగింపు 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే కాకుండా అందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తామని గతంలో ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు కొన్ని శాఖల్లో తొలగింపు ప్రక్రియను సైతం చేపట్టారు.

కమర్షియల్ డిపార్టుమెంట్‌లో తాత్కాలికంగా పనిచేస్తున్న 95 మందిని, ట్రెజరీ డిపార్టెమెం ట్‌లో 70 మంది, ఆడిట్ శాఖలో 14 మందిని, ఎక్సుజ్ శాఖలో 40 మందిని, డిగ్రీ కళాశాలలో 30 మందిని, టీఎస్డీఎల్‌ఐ డిపార్టుమెంట్ లో 20 మందిని, రిజిస్ట్రేషన్ శాఖలో 155 మందిని తొలగించింది. దాదాపు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత దశలవారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరానికి మించి ఉన్నారనే కారణంతో అదనపు ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే సుమారు 19 వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. 

కార్పొరేషన్ ఏర్పాటుతో పరిష్కారం 

కొన్ని శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెన్యూవల్ చేయలేదు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి రెన్యూవల్ ఆర్డర్ రాలేదు. మరికొన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఉద్యోగంపై అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ వేతనాలు ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతిరూపాయి ఉద్యోగుల చేరుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏపీ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. దీనికి తోడు మంత్రులు సైతం పలు సందర్భాల్లో రాష్ర్టంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని, అందరూ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తారని ప్రకటనలు చేశారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వ దృష్టికి ఉద్యోగ కార్మికుల సమస్యలను తీసుకొచ్చారు.

అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బిస్వాల్ కమిటీ, సుప్రీంకోర్టు సైతం ఇంక్రిమెంట్, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సూచించినా అమలు కావడం లేదని పేర్కొంటున్నారు. త్వరలోనే తమ సమస్యల పరిష్కారంపై ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నామని అవుట్ సోర్సింగ్ జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు.