calender_icon.png 19 June, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి

19-06-2025 01:25:23 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, జూన్ 18 :(విజయ క్రాంతి) జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి అనవసర జాప్యానికి తావు లేకుండా భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఐడీఓసీ వీసీ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్ల విస్తరణ, రైల్వే పనులు, నీటి పారుదల, జాతీయ రహదారులు, పరిశ్రమల స్థాపన తదితర వాటికి అవసరమైన భూసేకరణపై సంబంధిత అధికారులతో శాఖల వారీగా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పనుల కోసం అవసరమైన స్థల సేకరణకై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులతో సంప్రదింపులు జరుపుతూ, నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంభించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, భూసేకరణపై పెండింగ్ లో ఉన్న అప్పీల్ లను వేగంగా పరిష్కరించాలని అన్నారు. వారం అనంతరం భూసేకరణపై మళ్ళీ  సమీక్ష చేస్తామని, స్పష్టమైన ప్రగతి కనిపించాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మెప్మా పీ.డీ రాజేందర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు భాస్కర్, రైల్వే, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్, టీజీఐఐసి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.