28-11-2025 12:00:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాల్ పేట, నవంబర్ 27 : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఐదు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో గోపాల్పేట మండల పరిధిలో గోపాల్పేట, తాడిపర్తి, బుద్ధారం, పెద్దమందడి మండల పరిధిలో పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
వీరాయపల్లిలో కలెక్టర్ తో పాటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మల్లయ్య బట్టు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య కూడా పాల్గొని నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. గోపాల్ పేట తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవో అయేషా, పెద్దమందడి తహసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో తాళ్ల పరిణత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.