29-09-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఆల్మట్టిడ్యామ్ ఎత్తుపెంపుతో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల రైతులకు మరణ శాసనం రాసినట్లు అవుతుందని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఆలస్యంగా నీళ్లు వస్తున్నాయని, ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక్కడున్న భూములు పడావు పడతాయని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి సోయి లేదని ఇది దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే నల్లగొండ రైతులతో కలిసి చలో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడతున్నామని తెలిపారు.
ఆల్మట్టి వద్ద జరుగు తున్న కుట్రను బహిరంగంగా ఎండగడతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతసేపు కమిషన్లు, పంపకాలు తప్పితే తెలంగాణ రైతాంగ సమస్యల గురిం చి అవగాహన లేదన్నారు. నల్లగొండ జిల్లా నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నా..
ఆయనకు సోయి లేదని ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కైతే నీళ్ల గురించి అవగాహన లేదని, ఆయన ఓ డమ్మీ మంత్రి అని పేర్కొన్నారు. సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ తదితరులు ఉన్నారు.