12-01-2026 01:38:35 AM
వడోదర, జనవరి 11 : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన పరుగుల దాహం తీరలేదని నిరూపిస్తూ అత్యంత వేగంగా 28 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు ఈ రికార్డుకు 25 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ కివీస్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్లో ఫోర్ కొట్టి దానిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి 28 వేల పరుగులు చేసేందుకు 624 ఇన్నింగ్స్లే సరిపోయాయి. అంతకుముందు సచిన్ ఈ మైలురాయిని 644 ఇన్నింగ్స్లలో అందుకుంటే, లంక దిగ్గజం కుమార సంగక్కరాకు 666 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.
దీంతో 28 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ 296 వన్డేలు, 210 టెస్ట్లు, 117 టీ20లు ఆడి ఈ మైలురాయి అందుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గానూ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సంగక్కరను కూడా కోహ్లీ దాటేశాడు. సంగక్కర 666 ఇన్నింగ్స్లలో 28016 పరుగులు చేయగా.. సచిన్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2024లో టీ ట్వంటీలకు, 2025లో టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. సచిన్ 100 సెంచరీల రికార్డు కూడా అతన్ని ఊరిస్తోంది.