సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దివ్యాంగుల ధ్రువపత్రం పునరుద్ధరణ, నూతన ధ్రువపత్రాల కొరకు జిల్లాలో చేపట్టిన సదరం శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని సందర్శించి అభ్యర్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు ధ్రువపత్రాలు అందించేందుకు సదరం శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, అర్హత కలిగిన దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేయడంలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. అంగవైకల్య నిర్ధారణ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులు, సహాయకుల కొరకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అర్హతలు కలిగిన వారందరికీ సదరం ద్రృవీకరణ పత్రాలు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




