calender_icon.png 21 May, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌భవన్‌లో చోరీ

21-05-2025 12:00:00 AM

  1. హార్డ్‌డిస్క్ దొంగిలించిన మాజీ ఉద్యోగి

సీసీఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు

నిందితుడి అరెస్ట్..రిమాండ్

రాజ్‌భవన్‌లో భద్రతాలోపంపై పోలీసుల విచారణ

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్‌లో చోరీ కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. సుధర్మభవన్‌లోని మొదటి అంతస్తులో హార్డ్ డిస్క్ కనిపించకపోవడంతో రాజ్‌భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న చోరీ జరగగా..పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గతంలో హార్డ్‌వేర్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్‌డిస్క్ ఎత్తుకుపోయినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. హెల్మెట్‌తో గదిలోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు తేలడంతో నిందితుడిని ఈ నెల 14న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హార్డ్‌డిస్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు శ్రీనివాస్ గతంలో ఓ మహిళ ఫొటోల మార్ఫింగ్‌కు సంబంధించిన కేసులో అరెస్టు జైలుకు కూడా వెళ్లివచ్చాడు.

అయితే అత్యంత పటిష్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్ వద్ద సెక్యూరిటీ కళ్లుగప్పి నిందితుడు లోపలకు ప్రవేశించడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్లివచ్చి ఉద్యోగం నుంచి తొలగించబడిన వ్యక్తిని లోపలకు ఎలా అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ భద్రతలోపంపైనా పోలీసులు విచారణ జరుపనున్నట్లు సమాచారం.