14-05-2025 12:29:11 AM
ఇటీవల భారత్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశమంతా ఒకింత నిశబ్దం రాజ్యమేలింది. ఈ నేపథ్యంలోనే మదర్స్డే రావడంతో అందరి ఆలోచనలూ తమ బిడ్డలను బార్డర్కు పంపిన తల్లుల చుట్టే తిరిగాయి. ఇదే విషయమై బాలీవుడ్ నటి అలియాభట్ సోషల్మీడియా వేదికగా స్పందించారు. “కొన్ని రోజులుగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అంతా నిశబ్దమే.
అంతా ఆందోళనే. ప్రతి మాట, వార్త వెనుక ఒకరకమైన టెన్షన్. ఆదివారం మనమంతా మాతృదినోత్సవాన్ని సంతోషంగా చేసుకున్నాం. ఆలింగనాలు ఇచ్చిపుచ్చుకున్నాం. దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆ సంతోష సమయంలో ఆలోచించకుండా ఉండలేకపోయాం. వారిది అంతులేని త్యాగం. ప్రతి సైనికుడి యూనిఫాం వెనుక నిద్రలేని రాత్రులు గడిపిన అతడి తల్లి ఉంటుంది.
తన బిడ్డకు ఏ ఒక్క రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. అనిశ్చితి.. ఒత్తిడితో కూడిన ఆ నిశబ్దం ఏ క్షణమైనా బద్ధలు కావొచ్చు. కానీ, ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ఆ తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది.
పంటి బిగువన బాధను నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉందాం. మా రక్షకుల కోసం, ఈ దేశం కోసం కలిసి నిలబడదాం. జైహింద్” అంటూ అలియా సుదీర్ఘమైన పోస్టును పెట్టింది. ఈ పోస్టును చదివినవాళ్లంతా ఒకింత ఆలోచనలో పడిపోతున్నారు.