12-08-2024 01:46:48 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 11: యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజా రిపోర్ట్లో చేసిన ఆరోపణలు నిరాధారమంటూ సెబీ చీప్, అదానీ గ్రూప్లు ఆదివారం తిప్పికొట్టాయి. అదానీకి చెందిన విదేశీ ఫండ్స్లో సెబీ చైర్పర్సన్ మాధబిపురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్కు పెట్టుబడులు ఉన్నందునే అదానీ గ్రూప్పై సెబీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ హిండెన్బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సెబీ చైర్మన్ వ్యక్తి త్వాన్ని దెబ్బతీయడం ద్వారా సెబీ ప్రతిష్టపై హిండెన్బర్గ్ దాడికి తెగబడుతున్నదని బుచ్లు ఆరోపించగా, బుచ్తో తమకు ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవని అదానీ గ్రూప్ ఖండించింది.
బెర్ముడా, మారిషస్ల్లోని అదానీకి చెందిన ఫండ్స్లో బుచ్, ఆమె భర్తకు పెట్టుబడులు ఉన్నాయని, ఆ ఫండ్స్నే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఉపయోగించుకొని ఇండియాలో అదానీ గ్రూప్ షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచుతున్నట్టు హిండెన్బర్గ్ శనివారం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు బుచ్లు, అదానీ గ్రూప్ల నుంచి ఆదివారం వేరువేరుగా ప్రకటనలు విడుదలయ్యాయి.
పూర్తికాని సెబీ దర్యాప్తు
అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో కొద్ది విదేశీ ఇన్వెస్టర్లకే అధిక వాటాలు ఉన్నాయం టూ వచ్చిన ఆరోపణలపై 2020 అక్టోబర్లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. ఆ విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్ షేర్హోల్డర్లా లేక ప్రమోటర్లకు (అదానీలు) బినామీలా అనే కోణంలో దర్యాప్తును మొదలుపెట్టారు. ఐదు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో 14 20 శాతం మధ్య వాటా ఉన్న 13 విదేశీ ఫం డ్స్పై తాము దర్యాప్తు చేస్తున్నట్టు గత ఏడా ది సుప్రీంకోర్టు నియమిత కమిటీకి సెబీ తెలిపింది. ఈ రెండు దర్యాప్తులు పూర్తయినట్టు సెబీ వెల్లడించలేదు. ఈ అంశాన్నే హిండెన్బర్గ్ తాజా రిపోర్ట్లో లక్ష్యంగా చేసుకుని సెబీ చైరపర్సన్పై ఆరోపణలు గుప్పించింది.
ఇది సెబీ ప్రతిష్టపై దాడి: బుచ్లు
సెబీ చైర్పర్సన్ వ్యక్తిత్వాన్ని మంటకలపడం ద్వారా యూఎస్ హెడ్జ్ ఫండ్ హిం డెన్బర్గ్ సెబీ ప్రతిష్ఠపై దాడి చేస్తున్నదని సెబీ చీఫ్ మాధబిపురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్లు ఆరోపించారు. గౌతమ్ అదానీ సోదరుడుకి పెట్టుబడులు ఉన్న ఒక విదేశీ ఫండ్లోనే బుచ్లు ఇన్వెస్ట్ చేశారంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై ఆదివారం బుచ్లు ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. భారత్ మార్కెట్ నిబంధనల్ని ఉల్లఘించినందుకు హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్ నోటీసు జారీచేసిం దని, ఆ షోకాజ్కు సమాధానం ఇచ్చేబదు లు సెబీ చైర్మన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడం ద్వారా మార్కెట్ రెగ్యులేటర్ ప్రతిష్టను మంటకలిపేలా దాడి చేయడం దురదృష్టకరమని ప్రకటనలో పేర్కొన్నారు.
హిండె న్బర్గ్ తాజా రిపోర్ట్లో చేసిన ఆరోపణలు నిరాధారమని బుచ్లు తెలిపారు. తమ జీవితం, ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకమేనని వారు తెలిపారు. తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నప్పటి సమయంతో పాటు ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లనైనా వెల్లడించేందుకు వెనుకాడబోమని బుచ్లు పేర్కొన్నారు. అయితే అదానీ ఆఫ్షోర్ ఫండ్స్పై సెబీ దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందన్న విషయాన్ని వారు వెల్లడించలేదు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్స్టోన్కు 2019 నుంచి సీనియర్ అడ్వయిజర్గా ఉన్న ధవల్ బుచ్కు ఆ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ విభాగంతో సంబంధం లేదని బుచ్ దంపతులు తెలిపారు. 2017లో సెబీ సభ్యురాలిగా నియామకం జరిగినంతనే మాధబి బుచ్కు చెందిన రెండు కన్సల్టింగ్ కంపెనీలను మూసివేసినట్టు ప్రకటన వెల్లడించింది.
వ్యక్తిగత లబ్ధ్ది కోసమే: అదానీ గ్రూప్
హిండెన్బర్గ్ ఆరోపణలు వాస్తవాల్ని, చట్టాన్ని వదిలిపెట్టి వ్యక్తిగత లబ్ది కోసమే బహిరంగంగా అందుబాటులో వున్న సమాచారానికి మసిపూసి హిండెన్బర్గ్ ఆరోపణలు చేస్తున్నదని అదానీ గ్రూప్ మండిపడింది. హిండెన్బర్గ్ ప్రస్తావించిన ఫండ్స్ లేదా వ్యక్తులతో అదానీ గ్రూప్నకు ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవని ప్రకటనలో స్పష్టం చేశారు. పారదర్శకతకు, రెగ్యులేటరీ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ పేర్కొంది. గత ఆరోపణల్నే పదేపదే హిండెన్బర్గ్ ప్రస్తావిస్తున్నదని, 2023 మార్చిలో సుప్రీంకోర్టును వీటిని కొట్టివేసిందని గుర్తుచేసింది. విదేశీ ఫండ్స్లో తమ వాటాలు పూర్తి పారదర్శకమని, సం బంధిత వివరాలు పలు పబ్లిక్ డాక్యుమెంట్లలో ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నా మని గ్రూప్ వివరించింది.
మాధబికి యాంఫి మద్దతు
సెబీ చైర్పర్సన్పై విదేశాల నుంచి వస్తున్న ఆరోపణలు భారత క్యాపిటల్ మార్కెట్కు మాధబిబుచ్ అందించిన సేవల్ని, దేశ ఆర్థిక ప్రగతిని తక్కువ చేయడమేనని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువ ల్ ఫండ్ ఇండస్ట్రీ (యాంఫి) పేర్కొంది. గత సంఘటనల్ని అనుసంధానిస్తూ సంచలనాల్ని సృష్టించే ప్రయత్నమే తప్ప మరేది కాదని, భారత రెగ్యులేటరీ వ్యవస్థపై అవగాహన లేకపోవడమేనని ఈ ఆరోపణల్ని తప్పికొట్టకపోతే ప్రపంచం లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు అనవసర అడ్డంకులు ఏర్పడతాయని యాంఫి హెచ్చరించింది. ప్రస్తు త చైర్పర్సన్ నేతృత్వంలో తీసుకున్న పలు చర్యలతో మార్కెట్ పట్ల దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల విశ్వాసం పెంపొందిందని యాంఫి పేర్కొంది.