01-09-2025 02:29:06 AM
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): అక్రమాలు చేసినవారు నోటీసులు ఇచ్చినా.. నోటీసులు ఇవ్వకపోయినా కోర్టుకు వెళ్తున్నారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంపై చర్చలో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానమిస్తూ.. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, అందులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారించేందుకు వేసిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ నివేదికను ఉటంకించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యుత్తుపై వేసిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి విచారణలో భాగంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను పిలుస్తూ.. సెక్షన్ 8 బీ, సెక్షన్ 8సీ కింద నోటీసులు ఇచ్చారని, కానీ అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హైకోర్టుకు వెళ్లారని, తమకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పుడేమో సెక్షన్ 8 బీ,
8సీ కింద తమకు నోటీసులెందుకు ఇవ్వలేదంటూ.. కోర్టుకు వెళ్లారని.. నోటీసులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా కోర్టుకు వెళ్లడం వారికి అలవాటేనంటూ సీఎం పేర్కొన్నారు. అందుకే తమ నిర్ణయం తీసుకుం టుందని, ఇందులో ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని సీఎం తేల్చిచెప్పారు.