14-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఉద్యోగ నియామక ప్రక్రియలో పాదర్శకత అవసరమని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం శామీర్పేట్లోని నల్సా ర్ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎస్సీ)కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
ఉద్యోగ నియామకాలను సమగ్రంగా నిర్వహించాల్సిన బాధ్యత పీఎస్సీలపై ఉందని సూచించారు. దేశంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడున్నరేండ్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కృషిని దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగిందని గుర్తుచేశారు. పరీక్షల నిర్వహణలో పీఎస్సీ సమగ్రతను కాపాడే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కొనియాడారు.
సదస్సులో టీజీ పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, కర్ణాటక పీఎస్సీ చైర్మన్ సహాకర్, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ సంతోష్ గోపాల్ అజ్మీరా, దక్ష్ ప్రొగ్రాం డైరెక్టర్ సూర్య ప్రకాశ్, వెబ్న్యాయ్ సీఈవో విశ్వం జిందాల్, టీజీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, గుజరాత్ పీఎస్సీ చైర్మన్ హస్ముఖ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.