03-05-2025 06:06:28 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
నూతన రిజర్వాయర్ తో 27,497 ఇళ్లకు మంచినీటి సరఫరా..
రూ.30 కోట్ల ఖర్చు.. 20 కిలోమీటర్ల పైపులైన్...
పటాన్ చెరు/రామచంద్రాపురం (విజయక్రాంతి): శర వేగంగా విస్తరిస్తున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో మంచినీటి కొరత శాశ్వత పరిష్కారానికి నిర్మించిన నూతన రిజర్వాయర్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో 60 లక్షల లీటర్ల సామర్థ్యంతో 20 కిలోమీటర్ల పైపులైన్ తో నిర్మించిన రిజర్వాయర్లను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నూతన రిజర్వాయర్ ద్వారా ఉస్మాన్ నగర్ పరిధిలోని 55 కాలనీలకు మంచినీటి సరఫరా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు.
ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో నూతన రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు కనీస అవసరాలు అయినా విద్యుత్తు, మంచినీరు అంతరాయం లేకుండా అందించినప్పుడే మెరుగైన ప్రజా పాలన అందించినట్లు అవుతుందని తెలిపారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జిఎం సుబ్బరాయుడు, డీజీఎం లు చంద్రశేఖర్, శిరీష, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కమిషనర్ సంగారెడ్డి, స్థానిక నాయకులు ఉమేష్, రవీందర్ రెడ్డి, నరసింహ, శ్యామ్ రావు, దేవేందర్ యాదవ్, శ్రీనివాస్, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.