23-01-2026 12:15:15 PM
సిద్దిపేట రూరల్ జనవరి 23: నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి దేవిని పూజించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. నరసింహచారి మాట్లాడుతూ వసంత పంచమి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యాభివృద్ధితో పాటు సాంస్కృతిక విలువలను అలవర్చుకోవడం అవసరమని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆశీర్వచనాలు అందించారు. విద్యార్థులు ఆలపించిన భక్తిగీతాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వసంత పంచమి వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.