07-05-2025 04:48:24 PM
నెలరోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు...
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నెల రోజుల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఆర్యవైశ్యులే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత నెల రోజులగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి వేడుకలను నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా బుధవారం వాసవి మాత జయంతి సందర్భంగా దేవాలయంలో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మంగళ స్నానం, అమ్మవారి అలంకరణ, అభిషేకాలు, లలితా పారాయణం, వాసవి జీవిత చరిత్ర విశిష్టత, భజనతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మంగళహారతి తీర్థప్రసాద వితరణ అనంతరం భోజన కార్యక్రమాన్ని ఆలయ నిర్వహకులు ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం మంథని పురవీధుల గుండా వాసవి మాత ఉత్సవ విగ్రహాలతో శోభ యాత్ర లో మహిళా భక్తుల కోలాటాలు వివిధ సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు నలమాస ప్రభాకర్ తో పాటు నిర్వాహకులు, దేవాలయ కమిటీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఎల్లంకి వంశీధర్, మహిళా సంఘం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.