20-10-2025 12:28:31 AM
అమ్మవారిని దర్శించిన మఠాధిపతులు
వరంగల్, అక్టోబర్ 19, (విజయక్రాంతి): వరంగల్లోని చారిత్రక క్షేత్రం భద్రకాళి దేవస్థానం ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్లోని దత్తగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహామండలేశ్వర్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. ఆదివారం వారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
వారికి ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతులు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో దేశ ప్రజల శాంతి, ఐక్యత, ధర్మాభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం భక్తులకు ప్రవచనామృతాన్ని అందిస్తూ భద్రకాళి అమ్మవారు సాక్షాత్ శక్తిస్వరూపిణి అని, ఆమె కృప లభిస్తే జీవితంలో ధైర్యం, జ్ఞానం, కరుణ కలుగుతాయన్నారు.
భక్తులు భయం లేకుండా సత్యమార్గంలో నడవాలని, సనాతన ధర్మం నిలిచే చోటే ఆధ్యాత్మిక వెలుగు ఉంటుందన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో మఠాధిపతుల దర్శనంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. భక్తులు, అధికారులు పీఠాధిపతులను దర్శించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు.