పేదల సొంతింటి కల నెరవేర్చుతాం
హుజూర్నగర్, జూన్ 22: పేదల సొంతిం టి కల నెరవేర్చడమే లక్ష్యమని, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శ అభివృద్ధి నియోజకవర్గాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచర ణతో ముందుకు సాగుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఈ రెండు నియోజకవర్గాల్లో డిఎంఎఫ్టి నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధికారులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ, అభివృద్ధి, పోలీస్ శాఖల సేవలను వారి వద్దకే తీసుకువెళ్లే లక్ష్యంతో కొత్త కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కోదాడ ఈద్గా అభివృద్ధి, క్రైస్తవ సమాధి వాటిక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మతాల పట్ల ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదన్నారు.






