05-11-2025 06:15:08 PM
నేడు కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ల మౌన దీక్ష
బీసీ ఉద్యమ జేఏసీ నాయకుల తీర్మానం
కామారెడ్డి నుండి బీసీ ఉద్యమం ఉదృతం చేస్తాం
బీసీ ఉద్యమ జేఏసీ నాయకుల డిమాండ్
కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్తామని కామారెడ్డి బీసీ ఉద్యమ జేఏసీ నాయకులు తెలిపారు. బుధవారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో వారు మాట్లాడారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట పూలే, అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షలు చేపడుతామని వారు పేర్కొన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన అమలు చేయకపోవడంతో బీసీల రాజ్యాధికారమే ధ్యేయంగా త్వరలో మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమం బలోపేతం చేసే దిశగా బీసీ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం 9వ షెడ్యూల్లో చట్టబద్ధంగా చేర్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. లేదంటే గ్రామస్థాయి నుంచి అన్ని కులాల సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని రోడ్ల మీదికి వచ్చి తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ జేఏసీ నాయకులు సాప శివరాములు,నీల నాగరాజు,కుంబాల లక్ష్మణ్ యాదవ్,పండ్ల రాజు, సిద్ధిరాములు, మర్కంటి భూమన్న,వెంకట్ గౌడ్,సుదర్శన్, లలిత,మల్లన్న,గణేష్ నాయక్,సాయి కృష్ణ ,రాజయ్య,ఎల్లయ్య,రాజేందర్, దయాకర్,శివ తదితరులు పాల్గొన్నారు.