05-11-2025 08:53:18 PM
సాగర్ ఎడమ కాలువలో మర్రికుంట వద్ద బయటపడ్డ రెండు దేవత మూర్తులు విగ్రహాలు
గరిడేపల్లి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని మర్రికుంట సాగర్ ఎడమ కాలువ వద్ద ఇటీవల రెండు దేవత మూర్తులు నీటిలో బయటకు రావడంతో స్థానిక గ్రామస్తుల్లో ఆసక్తి చెలరేగింది. కాలువలో ప్రవహిస్తున్న నీటితో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్న ఈ విగ్రహాలు అమ్మవారికి చెందినవిగా కనిపిస్తున్నాయి. విగ్రహాలు కనిపించడంతో సమీపంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు కలిసి వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఎలా ఉంచారు. అన్నది స్పష్టత కలగాల్సి ఉంది. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం కాలువ పై ప్రాంతంలోని ఏదైనా దేవాలయం పునర్నిర్మాణం లేదా నీటి ప్రవాహం కారణంగా విగ్రహాలు ఇక్కడికి చేరి ఉండవచ్చని భావన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఈ ఘటనను ఆధ్యాత్మిక సంయోగంగా భావిస్తున్నారు. సంబంధిత శాఖలు, అధికారులు విగ్రహాల మూలాన్ని కనుగొనడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.