24-10-2025 12:00:00 AM
మణుగూరు, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ప్రజల అవసరం, అధికారుల నిర్లక్ష్యం కొందరు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. అక్రమాలకు అలవాటు పడిన కొందరు వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం ట్యాంపర్ చేస్తూ వినియోగ దారులను అడ్డంగా దోచుకుంటున్నారు. గతంలో కూరగాయలు ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడు కొసరు, మొగ్గు అని అడిగితే వ్యాపారులు కాస్తంత ఎక్కు వ తూకం ఇచ్చేవారు.
కానీ ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డిజిటల్ కాంటాలు వచ్చాయి. రాళ్ల కాంటాలతో హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఎలక్ట్రానిక్ కాంటాల్లో కూడా వినియోగదారులను ఎక్కువ మోసం చేయవచ్చని మండ లం లోని కొందరు వ్యాపారులు నిరూపిస్తున్నారు. కాటాలతో దగా చేస్తున్న కొందరు వ్యాపారుల చేతి వాటానికి నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం మోసపోతున్నారు. వ్యాపారుల తక్కెడ మోసాల పై విజయక్రాంతి కథనం...
విక్రయాల్లో నిలువు దోపిడీ..
వ్యాపారం ఓ నమ్మకం.. వినియోగ దారుడే దేవుడు. ఈ సూత్రాన్ని కొందరు వ్యాపారులు విస్మరిస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అవసరం, అధికారుల నిర్లక్ష్యం తో కొందరు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. అక్రమాలకు అలవాటు పడిన కొందరు వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం ట్యాంపర్ చేస్తూ వినియోగ దారులను నిలువునా దోచుకుంటున్నా రు. బడ్డీ కొట్టు మొదలుకొని కిరాణ, సూపర్ మార్కెట్ లు, రేషన్ షాపులు, పండ్లు, మాంసం, కూరగాయలు అమ్మే దుకాణాల వరకు తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతుండడంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
వ్యాపారుల చేతివాటం..
ఎలక్ట్రానిక్ కాంటాపై తూచి ఇవ్వడంతో అంతా బాగానే ఉందనుకుంటారు. ఏదైనా కేజీ సరుకును కొనుగోలు చేస్తే ఆ సరుకులో ఉండేది కిలో కాదు.. ఇదే కాదు లీటర్ నూనెగానీ, పాలు గానీ తీసుకుంటే వస్తున్నది 850 నుంచి 950 మిల్లీ లీటర్లే, ఇవే కాదు బి య్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతోంది. చిల్లర దుకాణాలు, చికెన్, మటన్ షాపులు, కూరగాయల మార్కెట్ల వరకు ఇదే తంతు కొనసాగుతుంది. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్ కాంటాలలో సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉండటమే దీనికి కారణం. ఎల క్ట్రానిక్ కాంటాలపై ఉండే ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్ప్లే కనిపించేలా చేస్తున్నారు.
తప్పుల తక్కెడ.. తనిఖీలెక్కడ?
మండలంలో ఎక్కడ చూసినా తప్పుల తక్కెడ మోసాలు కనిపిస్తున్నాయి. విని యోగదారులు నిత్యం నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్ది మేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్, మటన్, చేపల దుకాణాల్లో మాత్రం బారీ తేడాలు ఉంటున్నాయి. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో వది లేయడం వెనుక పలు ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వ్యాపారుల మోసాలపై దృష్టి పెట్టి తూకాల మోసాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతన్నారు.
ఫిర్యాదు వస్తే చర్యలు చేపడతాం
వస్తువు కొనుగోళ్లలో మోసాలకు పాల్పడతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తూనికల, కొలతల శాఖ కంట్రోల్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు వ్యాపారస్తులు కొలతలు సరిగా చేస్తున్నారా లేదా గమనించాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
మనోహర్, తూనికల కొలతల అధికారి