22-12-2025 02:13:59 AM
గాలికి వదిలేశారా? మూసీలో కలిపేశారా?
గాంధీభవన్లో పాతరేశారా?
సోనియాజీ తెలంగాణ ప్రజలకు తెలపాలి
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 21 (విజయక్రాంతి): ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి, ఇప్పుడు కొత్తగా విజన్-2047 అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా రు. అసలు ఆనాడు ఇచ్చిన 420 హామీలను గాలికి వదిలేశారా లేక మూసీ నదిలో కలిపేశారా.. లేక గాంధీ భవన్లో పాతరేశారా..’ అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన సందర్భాన్ని కిషన్రెడ్డి లేఖలో ప్రస్తావించారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగా ణ రైజింగ్- 2047 విజన్ డాక్యుమెంట్ను ‘మీకు అందించినప్పుడు, రెండే ళ్ల పాలన బాగుందని మీరు ఆయన్ని అభినందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదన్న విషయం మీకు తెలియదా లేక తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా..’ అని కిషన్రెడ్డి నిలదీశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఒకరినొకరు అభినందించుకోవడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో సోనియా గాంధీ స్వయంగా మేనిఫెస్టోను ఆవిష్కరించి, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రెండేళ్ల పాలన పూర్తయినా రాహుల్గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ, సోనియా గాంధీ గానీ ఆ హామీల అమలు గురించి రాష్ర్ట ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.
ఆరు గ్యారెంటీల గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత హామీ లను గాలికొదిలేసి, ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పేరుతో ప్రభుత్వం కొత్త పల్లవి అం దుకుందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు లు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మీ ‘వైఖరేంటో చెప్పండి.
ఇచ్చిన మాట మీద నిలబడకపోతే.. మీరు ప్రయోగించిన అభయహస్తం భవిష్యత్లో ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తంగా మారుతుంది. అది మిమ్మల్ని అధికారానికి దూరం చేయడం ఖాయం’ అని హెచ్చరించారు. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన లేఖలో స్పష్టం చేశారు.