21-05-2025 12:00:00 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, మే 20 (విజయ క్రాంతి): రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సాత్నాల మండ లం సుందరిగి గ్రామానికి చెందిన కొప్పుల లచ్చన్న అనే రైతు ఇటివల ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి మంగళవారం పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అనంతరం జోగు రామన్న అన్న మాట్లాడుతూ.. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఆత్మ స్థైర్యంతో ఉండాలని సూచించారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సైతం అందకపోవడం రైతుని తీవ్రం గా కల్చవేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో రైతుల కుటుంబాలలో తీవ్ర సంక్షోభం ఏర్పడి, రైతు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దేవన్న, మాజీ సర్పంచ్ నర్సింగ్, పోచ్చన్న, కిష్టన్న, సంతోష్, పోతన్న, కుమ్రా రాజు, ఉగ్గే విట్టల్ తదితరులు ఉన్నారు.