26-07-2025 12:49:58 AM
బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్
కరీంనగర్, జూలై 25 (విజయ క్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈనెల 28న హైదరాబాద్ లో సిట్ పోలీసులు నిర్వహించే విచారణకు హాజరవుతానని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన తనవద్దనున్న సమాచారాన్ని అందజేయడంతోపాటు సిట్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలకు చెందిన వేలాది మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని, భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే సంభాషణలను సైతం రికార్డు చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్ దని పేర్కొన్నారు.
ఇంతటి తీవ్రమైన అంశాన్ని విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి సాగదీస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ తో కుమ్మక్కై డీల్ కుదిరినందునే ఫోన్ ట్యాపింగ్ పై తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించేదాకా బీజేపీ పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరంచేస్తామన్నారు.