16-06-2025 01:41:04 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): మహిళలు అనేక రంగాల్లో పురుషులకు సమానంగా ఉన్నారని..వారికి ప్రతీ విషయంలోనూ మెరుగైన స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. ఆదివారం సాయంత్రం కవాడిగూడలోని అన్నం కాంప్లెక్స్లో ఆర్ఎల్డీ మహిళా విభాగం జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి (స్వతంత్ర) జయంత్ చౌదరి, ఆయన సతీమణి చారు సింగ్, ఆర్ఎల్డీ జాతీయ మహిళా అధ్యక్షురాలు కపిలవాయి ఇందిర, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎల్డీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్, పార్టీ మహిళా విభాగానికి చెందిన ఇతర జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. నేటికీ మహిళలు సరైన విద్య, వైద్యం అందుకోలేని దుస్థితి కొనసాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా కపిలవాయి ఇందిర నాయకత్వంలో ఆర్ఎల్డీ మహిళా విభాగాన్ని విస్తరించి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
మహిళా సాధికారత అవసరం: చారుసింగ్
మహిళా సాధికారత అత్యవసరమని జయంత్ చౌదరి సతీమణి చారుసింగ్ పేర్కొన్నారు. రానున్న మహిళా రిజర్వేషన్లను సమ ర్థవంతంగా ఉపయోగించుకోవాలని, దేశ నిర్మాణంలో మహిళలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆర్ఎల్డీ మహిళా విభా గం నిబద్ధతంగా పనిచేయాలని సూచించారు.
సమాజం కోసం పనిచేయాలి..
మహిళల్లో సహజంగా ఉన్న బలం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆర్ఎల్డీ మహిళా విభాగ జాతీయ అధ్యక్షురాలు కపిలవాయి ఇందిర పేర్కొన్నారు. మహిళలు స్వీయ న్యాయం కోసం నిలబడి సమాజ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. చారు సింగ్, జయంత్ చౌదరి మార్గదర్శకత్వంలో ఆర్ఎల్డీ మహిళా విభాగం కొత్త శిఖరాలను అధిరోహించి ఆశించిన లక్ష్యాలను సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్ఎల్డీ మహిళా విభాగ జాతీయ నాయకులు ప్రసంగించి, మహిళల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఆర్ఎల్డీ మహిళా విభాగ జాతీయ అధ్యక్షురాలు కపిలవాయి ఇందిర