సంగారెడ్డి జిల్లా మహిళలు స్కై వారియర్స్
ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
సంగారెడ్డి, మే 25(విజయ క్రాంతి): మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ దిధీ- కిసాన్ డ్రోన్ పై ఆదివారం నిర్వహించిన 122వ ఎపిసోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలు డ్రోన్ ద్వారా వ్యవసాయ పనులు చేపట్టి నూతన విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. మహిళా సాధికారతకు నాంది అన్నారు.
సంగారెడ్డి జిల్లా మహిళలపై ప్రశంసలు కురిపించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి వ్యవసాయంలో నూతన విప్లవాన్ని తీసుకువస్తున్నారని, తెలంగాణాలోని సంగారెడ్డి మహిళలు అందుకు నిదర్శనమని నరేంద్రమోదీ అన్నారు. సంకల్పానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని అన్నారు.
ఆ మహిళలు డ్రోన్ ల సహాయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో మందుల పిచికారీ పనిని నిర్వహించారని, మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగానే కాక స్కై వారియర్స్ గా గుర్తింపు పొందారని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అధికారులు, జిల్లా ప్రజల హర్షం వ్యక్తం చేశారు.




