calender_icon.png 1 September, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఎమ్మెల్యేలుగా పోటీచేయాలి

01-09-2025 02:14:46 AM

  1. కేరళలో సీఎం రేవంత్‌రెడ్డి

ఎంపీ మెరిట్ అవార్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు

రెండు శక్తుల మధ్యే 2029 లోక్‌సభ ఎన్నికలు  

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): యువతకు ఎమ్మెల్యేలుగా పోటీచేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.21 ఏళ్ల వయసున్న ఐఏఎస్‌లు జిల్లాలను సమర్థవంతంగా నడుపుతున్నప్పుడు 21 ఏళ్ల వయసున్న యువత ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదన్నారు. ఆ దిశగా మనం రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని,  యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆదివారం కేరళలోని అలప్పుజలో మెరిట్ విద్యార్థులకు అందించే “ఎంపీ మెరిట్ అవార్డ్- కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 2029లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు రెండు శక్తుల మధ్య జరగబోతున్నాయని పేర్కొన్నారు.

రాజ్యాంగ పరిక్షణ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్ద ఆర్థిక బలం, మీడియా మద్దతు లేదని.. కేవలం యువత, వారి శక్తిని నమ్ముకుని కాంగ్రెస్ పోరాటం సాగిస్తోందని చెప్పారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అయితే బీజేపీ యువత హక్కులను కొల్లగొడుతోందని..కానీ కాంగ్రెస్ యువత హక్కులను పరిరక్షిస్తుందని.. దేశంలోని యువత ఈ  తేడాను గమనించాలని పేర్కొన్నారు. 

మెరిట్ అవార్డులకు చాలా ప్రత్యేకత

కేసీ వేణుగోపాల్ ఎప్పుడూ తన నియోజకవర్గంతో పాటు కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వేణుగోపాల్ 2006లో ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉందన్నారు.

10వ, 12వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ఈ ఏడాది వందశాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన  విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని, దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ర్టం కేరళ అని తెలిపారు.  ఈ రాష్ర్టంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

10వ, 12వ తరగతి తర్వాత సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదని పేర్కొన్నారు. ‘విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి’ అని తాను  చాలా బలంగా విశ్వసిస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవభూమి కేరళ రాష్ర్టమని కొనియాడారు.

తెలంగాణలో విద్యాభివృద్ధికి కృషి

తెలంగాణలోకూడా విద్యాభివృద్ధికి పెద్దఎత్తున దృష్టి సారించామని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాపెట్టుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నామన్నారు.

‘తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం. కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నాం. ఒక్కో స్కూల్‌ను  రూ.200 కోట్ల ఖర్చుతో 25 ఎకరాల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, నాణ్యమైన విద్యను అందించేలా నిర్మించబోతున్నాం’ అని తెలిపారు.

‘యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. దీనికి ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించాం. ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశాం. దీనితోపాటు ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

వేణుగోపాల్  తీసుకున్న ఈ చొరవను ప్రతి నియోజకవర్గంలో, రాష్ర్టం మొత్తం ఈ విధానాన్ని స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నానని.. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్రస్థానంలో విజేతగా నిలుస్తున్న కేరళ రాష్ర్టం పట్ల ఒకింత అసూయ కలుగుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు.

రాహుల్, ప్రియాంకల కర్మభూమి కేరళ

‘గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలను తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరాను. కానీ వారు కేరళను తమ ఇంటిగా, తమ నియోజకవర్గంగా, తమ కర్మభూమిగా ఎంచుకున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఈ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నాం. ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తున్నామని, ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముంది’ అని ఆయన అన్నారు.

‘కేరళ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. 2026లో జరిగే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించవద్దని, అవి 2029లో దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలవుతాయి’ అని జోస్యం చెప్పారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్ గాంధీ ఓటు హక్కును  కల్పించారని, కానీ ప్రధాని మోదీ పౌరుల నుంచి ఓటు హక్కును కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ యువత హక్కులను పరిరక్షిస్తుందని గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2029 సంవత్సరం రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసే సంవత్సరంగా అందరికీ చాటుదామని పిలుపిచ్చారు. ‘మీరే మా నమ్మకం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీ భవిష్యత్తు కోసం పోరాటం చేయండి. దేశం కోసం పోరాటం చేయాలి’ అని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.