calender_icon.png 27 November, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహ్మదాబాద్‌లో 2030 కామన్‌వెల్త్‌గేమ్స్

27-11-2025 12:00:00 AM

  1. ధృవీకరించిన కామన్‌వెల్త్ స్పోర్ట్
  2. క్రీడలపై మన నిబద్ధతకు ఇది గుర్తింపు: ప్రధాని మోదీ

గ్లాస్గో, నవంబర్ 26 : ప్రతిష్టాత్మక 2030 కామన్‌వెల్ ్తగేమ్స్ ఆతిథ్య హక్కులు భారత్‌కే దక్కాయి.గతంలోనే ఖరారైనప్పటకీ బుధవారం గ్లాస్గోలో జరిగిన సమావేశంలో కామన్‌వెల్త్ స్పోర్ట్ దీనిని ధృవీకరించింది. ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద క్రీడాసంబరంగా చెప్పే కామన్‌వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ వేదికగా నిలవబోతోంది. 2010లో న్యూఢిల్లీ వేదికగా ఈ క్రీడలు జరిగాయి. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న సమయంలో కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు రావడం కీలక పరిణామంగా చెప్పొచ్చు.

బిడ్డింగ్‌లో నైజీరియా నగరం అబుజా నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే వార్షిక సమావేశంలో 74 దేశాల ప్రతినిధులు అహ్మదాబాద్‌కు ఓటేశారు. 2030తో కామన్‌వెల్త్ గేమ్స్‌కు వందేళ్లు పూర్తవుతున్నాయి. ఇదిలా ఉంటే కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కడం ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన మోదీ కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ దేశానికి గర్వకారణమన్నారు.

క్రీడల పట్ల మన దేశానికి ఉన్న నిబద్దతతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ క్రీడాసంబరంతో గ్లోబల్ మ్యాప్‌లో భారత్ సత్తా మరోసారి చాటిచెప్పబోతున్నామని తెలపారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను అత్యద్భుతంగా నిర్వహించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. కాగా భారత్‌ను ప్రపంచ క్రీడాకేంద్రంగా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి ఇది నిదర్శనమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దశాబ్ద కాలంగా దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను మోదీ అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు.

మరోవైపు 2023 కామన్‌వెల్త్ గేమ్స్‌లో 15 నుంచి 17 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని కామన్‌వెల్త్ స్పోర్ట్ తెలిపింది. వీటిలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్ వంటి పలు క్రీడలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, షూటింగ్, స్కాష్, బీచ్ వాలీబాల్, టీ20 క్రికెట్ , సైక్లింగ్, రగ్బీ వంటి మరికొన్ని క్రీడలను కూడా పరిశీలిస్తున్నారు. వీటి ఎంపిక ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.